వ్యూహాత్మక భాగస్వామ్యం కోసమే

  • భద్రాతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వానికి కట్టుబడిలేము
  • భారత్‌ పర్యటనపై ఒబామా
భారత్‌తో నిజమైన వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని నిర్మించడం తన విదేశాంగ విధాన అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. వివిధ అంశాలపై భారత్‌-అమెరికా సహకారాన్ని విస్తృత స్థాయిలో నూతన తీరాలకు తీసుకు వెళ్లేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని తనకు ఈ పర్యటన
కల్పిస్తుందని చెప్పారు. ఒబామా అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ప్రారంభమయ్యే ఆయన మూడు రోజల పర్యటనను పురస్కరించుకొని పిటిఐ వార్తా సంస్థ ఒబామాతో మాట్లాడింది. భారత్‌-అమెరికా భాగస్వా మ్యం రెండు దేశాల ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, ఈ కారణం వల్లనే భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదగడానికి మద్దతు ఇస్తున్నానని ఒబామా తెలిపారు. భారత్‌ ఎదుగుదల ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా రెండు దేశాలకు (భారత్‌, అమెరికా) ప్రయోజనకరమని చెప్పారు. పిటిఐ అడిగిన అనేక ప్రశ్నలకు ఒబామా సమాధానమిచ్చారు. ద్వంద్వ వినియోగ టెక్నాలజీ ఎగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేత, ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు అంశాలపై ప్రకటన చేసే అవకాశముందా అని ప్రశ్నించగా, ఈ రెండు అంశాలు కష్టమైనవి, క్లిష్టమైనవని ఒబామా సమాధానమిచ్చారు.

అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో ఒక ఒప్పందానికి వచ్చేందుకు తమ బృందాలు నిరంతరం కసరత్తు చేస్తున్నాయని, తమ వ్యూహా త్మక భాగస్వామ్యంలో భాగంగానే భారత్‌తో వ్యవహరిస్తున్నామని తెలిపారు. శాంతియుత, సైనిక ప్రయోజనాలకు వినియోగించే వస్తువుల ఎగుమతులపై ఆంక్షలు ఉన్నట్లుతెలిపారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కే విషయంలో మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి లేమని తెలిపారు. మీ పర్యటనలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నట్లుగా కనబడటంలేదన్న ప్రశ్నకు ఒబామా స్పందిస్తూ తాను భారత్‌లో ఉండగా తాను, ప్రధాని మన్మోహన్‌ ఏ అంశాలపై చర్చిస్తామనేది ముందుగా ప్రకటించబోనని తెలిపారు. రెండు దేశాల ప్రజలపై ప్రత్యక్షంగా, సానుకూలంగా ప్రభావం చూపే అంశాలపై తాము ఎలాంటి ప్రకటనలు చేస్తామో మీరు (మీడియా) ఊహించగలరని అనుకుంటున్నానన్నారు. తమ ఎజెండాలో ముఖ్యమైన అంశాలున్నాయని, భారత్‌-అమెరికా భాగస్వామ్యం ముందుకు వెళ్లేందుకుగాను బలమైన పునాదులు వేస్తామన్న నమ్మకం తనకుందని ఒబామా పేర్కొన్నారు. ప్రస్తుతం తాము ఆర్థిక సంబంధాలు మొదలుకొని కౌంటర్‌ టెర్రరిజం వరకు, భద్రతా సహకారం నుంచి పరిశుద్ధ ఇంధన అభివృద్ధి వరకు ప్రతి అంశంపై విస్తృతంగా పని చేస్తున్నామని చెప్పారు. ఇదంతా భారత్‌-అమెరికా సంబంధాల్లో సానుకూల సంకేతాలను తెలియచేస్తోందన్నారు. ఆసియాకు సంబంధించి అమెరికా సంబంధాల్లో భారత్‌ కీలకమని చెప్పారు.

అమెరికా ఉద్యోగాలను నేనే రక్షించాలి : ఔట్‌సోర్సింగ్‌పై ఒబామా
అమెరికా ప్రజల ఉద్యోగాలను రక్షించాల్సిన బాధ్యత తన మీద ఉందని అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చెప్పారు. ఔట్‌సోర్సింగ్‌పై భారత్‌ ఆందోళనలకు తన అజెండాలో చోటు ఉండకపోవచ్చని ఆయన సూచించారు. భారత్‌, మరి కొన్ని దేశాలకు అమెరికా ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిటిఐతో మాట్లాడారు. అమెరికా-భారత్‌ ఆర్థిక సంబంధాలు గెలుపు-గెలుపు సంబంధంగా (విన్‌-విన్‌ రిలేషన్‌షిప్‌) ఉండాలన్నారు. తన పరిపాలన అమెరికా ఆర్థిక పునరుజ్జీవనం, అమెరికా భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, పరిరక్షణ, ఎగుమతుల పెంపు, వ్యాపారాభివృద్ధికి అవకాశాలు, ప్రోత్సాహకాలు తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు ఒబామా చెప్పారు. ఉత్పత్తులు, సేవలు, పెట్టుబడులకు తమ మార్కెటు తెరచి ఉందన్నారు. అమెరికా కంపెనీలు ఇతర దేశాల మార్కెట్లతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయో భారత్‌ సహా ఇతర దేశాలు కూడా అమెరికాతో అలాంటి సంబంధాలే కలిగి ఉంటాయన్న నమ్మకం ఉందన్నారు. బారత్‌లో ప్రపంచ శ్రేణి కంపెనీలు ఉన్నాయని, వాటిల్లో అనేక కంపెనీలు అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని, మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. తన పరిపాలన మరింత పెట్టుబడులను, ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నదని ఒబామా అన్నారు.

 

0 comments: