'మైక్రో'లే బ్యాంక్‌ ఏజెంట్లు!

  • అకౌంట్లు, డిపాజిట్ల సేకరణ
  • 'రుణం' తీర్చుకొంటున్న బ్యాంకులు
  • పేదలు నిలువు దోపిడీ
కొన్ని జాతీయ, ప్రైవేట్‌ బ్యాంకులకు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఏజెంట్లుగా మారాయి. కుగ్రామాల నుండి కొత్త అకౌంట్లను, డిపాజిట్లను సేకరించి భారీగా కమీషన్లు పొందుతున్నాయి. దానికి ప్రతిఫలంగా బ్యాంకులు మైక్రోలకు భారీగా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. మైక్రోలు పేదలకు అప్పులిచ్చి నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ బ్యాంకుల పరిధిలోకి తీసుకొచ్చి అందరికీ బ్యాంక్‌ అకౌంట్లు ఇవ్వాలని కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్‌ రెండు మూడేళ్ల నుండి ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రతి గ్రామానికీ బ్యాంకులు సర్వీస్‌ ఇవ్వలేవంటూ ఆర్‌బిఐ వ్యాపార నిబంధనలను
సరళీకరించింది. ప్రత్యామ్నాయ బ్యాంకింగ్‌ వ్యవస్థ పేరిట దీన్ని ముందుకు తెచ్చింది. ప్రైవేట్‌ వ్యక్తులు లేదా సంస్థలను బ్యాంకులు తమ ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకోడానికి అనుమతించింది. వీరిని బిజినెస్‌ కరెస్పాండెంట్లు, వెండర్లుగా చెబుతున్నారు. బ్యాంకులకు, ఖాతాదార్లకు మధ్య వీరు సంధానకర్తలుగా ఉంటారు.భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ (ఐసిటి)ని సర్వీస్‌ ప్రొవైడర్ల నుండి తీసుకొని బ్యాంకు బ్రాంచిలు, ఎటిఎంలు లేని గ్రామాల్లో అవుట్‌లెట్లను ఈ బిజినెస్‌ కరస్పాండెంట్లే ఏర్పాటు చేస్తారు. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లక్ష్యాలను చేరడానికి రాష్ట్రంలోని ప్రముఖ జాతీయ బ్యాంకులు మైక్రోలను లేదా వారి ప్రతినిధులను తమ ఏజెంట్లుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కింద అత్యధిక బ్యాంక్‌ అకౌంట్లు తీసింది మన రాష్ట్రంలోనేనని ఆర్‌బిఐ నివేదికలు చెబుతున్నాయి. అందుకు ముఖ్య కారణం ఇక్కడ మైక్రో కార్యకలాపాలు జోరుగా సాగుతుండటమే. మైక్రోలే బ్యాంకులకు గ్రామాల్లో ఏజెంట్ల అవతారం ఎత్తాయి. దీనివల్లనే ఇతర రాష్ట్రాల్లో కంటే ఇక్కడ ఎక్కువ ఖాతాలు బ్యాంకులకు లభ్యమైనట్లు చెబుతున్నారు. సూక్ష్మ సంస్థల ప్రతినిధులు బ్యాంకులకు డిపాజిట్లు, అకౌంట్లు సేకరిస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్‌, ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌, యాక్సిస్‌తో సహా పలు బ్యాంకులు ఇందుకోసం మైక్రోలపై ఆధారపడుతున్నాయి. ఇప్పటి వరకూ దేశం మొత్తం మీద ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌లో 70 లక్షల కొత్త ఖాతాలు బ్యాంకుల్లో ప్రారంభించగా ఒక్క మన రాష్ట్రంలో 56 లక్షలకు పైగా అకౌంట్లు ప్రారంభమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. అంటే దేశంలో కొత్తగా తీసిన బ్యాంక్‌ అకౌంట్లలో 75 శాతం మన రాష్ట్రంలోనే ఉన్నాయి. మైక్రో సంస్థలు బ్యాంకులకు ఏజెంట్లుగా మారి మారుమూల గ్రామాలకు సైతం విస్తరించి తమ ప్రతినిధుల ద్వారా బ్యాంకులకు కొత్త అకౌంట్లను సేకరించి పెడుతున్నాయి. బ్యాంకుల నుండి కమీషన్లు పొందుతున్నాయి. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌లో సాయం చేసినందుకు బ్యాంకులు మైక్రోలకు పెద్ద మొత్తంలో అప్పులిస్తున్నాయి. బ్యాంకుల నుండి 8.5-9 శాతం వడ్డీకి అప్పులు తీసుకుంటున్న మైక్రోలు 26.5 నుండి 60 శాతం వడ్డీకి పేదలకు అప్పులిచ్చి నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, కర్నాటక తదితర రాష్ట్రాల్లో రెండు- మూడు లక్షలు, అంతకంటే తక్కువ కొత్త బ్యాంక్‌ అకౌంట్లు రావడానికి, ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది బ్యాంక్‌ అకౌంట్లు ప్రారంభం కావడానికి మైక్రోల కార్యకలాపాలే కీలకం. ఇక్కడ ఎక్కడా లేని విధంగా 30కి పైగా మైక్రోలున్నాయి.
ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌తో పాటు ప్రతి గ్రామానికీ 2012 నాటికి బ్యాంకింగ్‌ సౌకర్యం కల్పించాలని డాక్టర్‌ సి.రంగరాజన్‌ కమిటీ చెప్పింది. తొలిదశలో రెండు వేల జనాభాను మించిన గ్రామాల్లో బ్యాంకింగ్‌ సర్వీసులు ఏర్పాటు చేయాలంది. రాష్ట్రంలో 1,128 మండలాలుండగా మూడు మండలాల్లో అసలు బ్యాంక్‌ బ్రాంచి లేదు. 109 మండలాల్లో ఒక్కటే బ్రాంచి ఉంది. మండలాల పరిస్థితి ఈ విధంగా ఉంటే అన్ని గ్రామాల్లో బ్యాంకు సర్వీసులు సాధ్యం
కాదు. అందుకే ఆర్‌బిఐ సూచించినట్లు ప్రైవేట్‌ బిజినెస్‌ ప్రతినిధులను బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక రాష్ట్రంలో 27,507 గ్రామాలుండగా రెండు వేల జనాభాకు పైబడి ఉన్న గ్రామాలు 9,517 కాగా 6,999 గ్రామాల్లో బ్యాంకింగ్‌ సర్వీసుల్లేవు. వచ్చే రెండేళ్లలో ఈ గ్రామాలన్నింటిలోనూ ప్రైవేట్‌ ప్రతినిధులు అవుట్‌లెట్లు లేదా సర్వీస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

 

0 comments: