వాస్తవాలు కప్పిపుచ్చి సుద్దులు చెప్పిన ఒబామా

అమెరికాలోని పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకే ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో పర్యటించారని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. అణ్వాయుధాలను నిరోధించటం, మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం తదితర విషయాల్లో తమ దేశం చేస్తున్న తపుల్ని కప్పిపుచ్చి, వాస్తవాలను మరుగుపరిచిన ఒబామా మన దేశానికి, ప్రజలకు సుద్దులు చెప్పటం విడ్డూరంగా ఉందని
అన్నారు. ఒబామా మన ప్రభుత్వాధిóనేతలతో చేసుకున్న ఒప్పందాలేమిటి? వాటిపై మన ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉండబోతు న్నాయి? ఒప్పంద పర్యవసాలేమిటి? అనే విషయాలను దేశ ప్రజల ముందు పెట్టాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భారత ప్రభుత్వం అమెరికాతో సామ్రాజ్యవాద అనుకూల ఒప్పందాలు చేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. బస్‌భవన్‌ దగ్గర ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి మీదుగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు సాగింది. ఈ ప్రదర్శనలోనాలుగు వామపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభకు సిపిఎం హైదరాబాద్‌ నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, సిపిఐ నగర కార్యదర్శి విఎస్‌ బోస్‌ అధ్యక్షత వహించారు.

వంచన తప్ప మరోటి కాదు : రాఘవులు
అన్ని రకాలుగా భారత్‌కు పెద్దపీట వేస్తామని చెప్పిన ఒబామా మాటల వలలో పడిన మన నాయకులు దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించటం దురదృష్టకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. సమితిలో శాశ్వత సభ్యత్వం కావాలంటే అంతర్జాతీయంగా నాలుగు అంశాల్లో భారత్‌ అమెరికాతో పాలుపంచుకోవాలని ఒబామా ప్రమాదకరమైన షరతు విధించారని గుర్తుచేశారు. అణ్వాయుధ నిరోధక చర్యల్లో భారత్‌ భాగస్వామి కావాలంటూ అమెరికా అధ్యక్షుడు కోరటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అణు కర్మాగారాలు కలిగుందన్న సాకుతో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా ఆ దేశంపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను విధించిందని చెప్పారు. ఇదే సమయంలో తనకు మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌ అణ్వాయుధాలను కలిగున్నప్పటికీ, పాలస్తీనియన్లను హింసిస్తుంటే అమెరికా దానికి వత్తాసు పలకటం గమనార్హమని అన్నారు. అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న భారత్‌ ఎన్నో ఏళ్లుగా మనకు గ్యాస్‌, ఆయిల్‌ను సరఫరా చేసుకున్న ఇరాన్‌తో తెగతెంపులు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. మానవ హక్కుల్ని కాపాడేందుకు భారత్‌ సహకరించాలన్న ఒబామా ఇరాక్‌, ఆప్ఘనిస్తాలపై అమెరికా దాడుల విషయమై సమాధానం చెప్పాలని అన్నారు.

అంతర్జాతీయంగా మానవ హక్కుల్ని ఖూనీ చేసింది అమెరికాయేనని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటంలో భారత్‌ సహాయాన్ని అర్థించిన ఒబామాకు వెనిజులాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సిఐఎ కుట్ర పన్నిందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. అమెరికా ప్రోత్సాహంతోనే వెనిజులా సైన్యాధికారులు ఆ దేశాధినేత ఛావెజ్‌పై కుట్రపన్ని ఆయన్ని నిర్బంధించారన్న విషయాన్ని మరిచి ఒబామా మాట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడి 'ప్రజాస్వామ్య పరిరక్షణ' అనే మాటలకు అర్థం ఇదేనా? అని రాఘవులు అన్నారు. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న అమెరికా దేశాధ్యక్షుడైన ఒబామా టెర్రరిజాన్ని రూపుమాపేందుకు తోడ్పడాలని భారత్‌ను కోరటం హాస్యాస్పదమని అన్నారు. పాకిస్తాన్‌కు ఉచితంగా ఆయుధాలు సరఫరా చేస్తూ అక్కడ తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్న అమెరికా కాశ్మీర్‌లో చిచ్చు రగిలిస్తోందని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లకు అమెరికా శిక్షణనిచ్చి రష్యా, చైనాల మీదికి వారిని ఉసిగొలుపుతోందని అన్నారు. ఆ నాలుగు షరతులను భారత్‌ అంగీకరించటమంటే ప్రపంచ ప్రజలతో పోరాటం చేయటమేనని అన్నారు. ఆ ఒప్పందాలకు వ్యతిరేకంగా మన దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వామపక్షాల ఆధ్వర్యాన మన్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
అజ్ఞాత ఎజెండా : నారాయణ
ఒబామా ఒక అజ్ఞాత ఎజెండాతో మన దేశంలో పర్యటించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్న తన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవటం కోసమే ఆయన భారత్‌కు వచ్చారని అన్నారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటికీ ఇరాక్‌, ఇజ్రాయిల్‌, పాకిస్తాన్‌లపై ఆ దేశం అనుసరిస్తున్న విధానాల్లో మార్పేమీ రాలేదన్నారు. భోపాల్‌ గ్యాస్‌ ఉదంతంలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, దానికి బాధ్యుడైన అండర్సన్‌ను అప్పగించటానికి ఒబామా అంగీకరించటం లేదని తెలిపారు. మనదేశ చిల్లర వర్తకంలోకి అమెరికా కంపెనీలు రావటం వల్ల 5 కోట్ల మంది చిల్లర వ్యాపారులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో మాదిరే : దేశ్‌పాండే, జానకిరాములు
గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారికి, ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాకు విధానాల్లో ఎలాంటి తేడా లేదని ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శులు మురళీధర్‌దేశ్‌పాండే, జానకిరాములు విమర్శించారు. ఆప్ఘనిస్తాన్‌, ఇరాన్‌లాంటి దేశాలను ఉక్కుపాదంతో అణిచివేస్తూ అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

 

0 comments: