ఒత్తిళ్లకు లొంగొద్దు

  • స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలి
  • ఆండర్సన్‌ను భారత్‌కు అప్పగించాలి
  • అమెరికా పెత్తందారీ విధానాలపై హోరెత్తిన లెఫ్ట్‌ నిరసన
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో పర్యటిస్తున్న ప్రస్తుత సమయంలో ఆ దేశ పెత్తందారీ విధానాలను నిరసిస్తూ వామపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. సిపిఎం, సిపిఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌, తదితర వామపక్షాలకు చెందిన కార్యకర్తలు దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొని అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని కేంద్రంలోని
యుపిఎ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదే విధంగా భోపాల్‌ గ్యాస్‌ విషాదానికి కారకుడైన వారెన్‌ ఆండర్సన్‌ను భారత్‌కు అప్పగించాలని, భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ పరిసరాలలో పేరుకుపోయిన విష వ్యర్థాలను తొలగించే బాధ్యత తీసుకునేలా డౌ కెమికల్స్‌ సంస్థను ఆదేశించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వెంటనే అమెరికా నాటో దళాలను ఉపసంహరించుకోవాలని, పాలస్తీనా ఆక్రమిత భాగాలను ఖాళీ చేసేంత వరకూ ఇజ్రాయిల్‌కు ఎటువంటి సాయం అందించరాదని వారు నినాదాలు చేశారు. క్యూబాపై కొనసాగిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని కూడా వారు ఒబామాను డిమాండ్‌ చేశారు. వ్యవసాయం, విద్య, రిటైల్‌ వ్యాపార రంగాలను అమెరికా బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టవద్దని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.


న్యూఢిల్లీలో జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంటు వరకూ కొనసాగిన ఈ నిరసనప్రదర్శననుద్దేశించి సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌ నేత దేవవ్రత విశ్వాస్‌, ఆరెస్పీ నేత అబనీరారు, తదితరులు ప్రసంగించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం పేరిట భారత్‌పై పెత్తనం చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను వారు నిశితంగా విమర్శించారు. హెడ్లీని డబుల్‌ ఏజెంట్‌గా ఉపయోగించుకుని ముంబయి దాడులకు సంబంధించి అతడు, అతడి భార్య వెల్లడించిన సమాచారాన్ని భారత్‌కు అందజేయని అమెరికాను ఏ విధంగా విశ్వసించగలమని వారు కేంద్రాన్ని నిలదీశారు. భారత్‌, అమెరికా రక్షణ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని, అమెరికా అణు సరఫరాదారుల బాధ్యతను తొలగించేలా తెస్తున్న ఒత్తిడులను వెంటనే విరమించాలని డిమాండ్‌ చేశారు.

 

0 comments: